Fire accident in Pathan Cheru : సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలంలో అగ్నిప్రమాదం.ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు.
దీపావళి పండుగ వేళ భాగ్యనగరంలో ఓ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలం పాశమైలారంలో చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడాలో ఉన్న ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడం వల్ల అగ్ని ప్రమాదం జరినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు, అంతే కాక అగ్నిమాపక సిబ్బందిలో ఒక వ్యక్తికీ కూడా గాయాలయ్యాయి.
ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళితే.. పారిశ్రామిక వాడలో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలోని రియాక్టర్ లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. అయితే కార్మికులు ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాకపోగా ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో నలుగురు కార్మికులు, ఎగసిపడిన మంటల కారణంగా గాయాల పాలయ్యారు.
ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు మంటలను కట్టడి చేసినప్పటికీ, అగ్నిమాపక సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులు రసాయన ఘాటుకి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మరో వ్యక్తి మంటల వల్ల గాయపడ్డాడు. గాయపడిన 4 కార్మికులను అగ్నిమాపక శాఖ అధికారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.