
One Day World Cup Final : వరల్డ్ కప్ పుణ్యమా అని హోటల్ ధరలకు రెక్కలు.. హోటల్ ధరలకు బారి డిమాండ్.
వన్ డే ప్రపంచ కప్ తుది అంకానికి చేరుకుంది, ఆఖరి మ్యాచ్, అంటే ఫైనల్ లో ఆస్ట్రేలియా భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ ముగింపు మ్యాచ్ ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్ కి గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
పైగా ఆయన పేరు మీద ఉన్న స్టేడియంలో జరగబోతున్న మ్యాచ్ కి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవబోతున్నారు. పైగా ఈ మ్యాచ్ కి బాలీవుడ్, టాలీవుడ్ నుండి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ కూడా వస్తారని తెలుస్తోంది.
ఈ మేరకు వారు మ్యాచ్ చూసేందుకు టికెట్లు బుకింగ్ కూడా చేసేసుకున్నారు. అయితే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్ కారణంగా అక్కడి హోటల్ గదుల ధరలకు రెక్కలొచ్చాయి.
సాధారణ రోజుల్లో హోటల్ గదిలో ఉండాలంటే వారు వసూలు చేసే అద్దె కేవలం 5 వేల రూపాయలు మాత్రమే, కానీ ఇప్పుడు అక్కడ జారబోయే మ్యాచ్ ను దృష్టిలో పెట్టుకుని 50 వేల రూపాయల వరకు పెంచేశారట హోటల్ నిర్వాహకులు.
ఈ రేట్లు చుసిన వారు అవాక్కవుతున్నారు. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అన్న సామెత ను వీరు బాగా వంట బట్టించుకున్నారు అంటున్నారు వీరి ధరలు చుసిన కొంతమంది.
ఇది ఇలా ఉంటె దూర ప్రాంతాల నుండి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడాలనుకునే వారు క్రికెట్ మ్యాచ్ కి సంబంధించిన టికెట్ మాత్రమే కొనుగోలు చేస్తే సరిపోదు, ఆ నగరంలో స్టేడియం కి దగ్గరలో ఏదైనా ఒక హోటల్ లో రూమ్ కూడా బుక్ చేసుకోవాలి.
మ్యాచ్ చూసేందుకు టికెట్ తీసుకుని హోటల్ బుక్ చేసుకోని వారు మాత్రం ఇప్పుడున్న ధరలు చూసి బావురుమంటున్నారు. ఇక్కడ కొన్ని లగ్జరీ హోటళ్ళు నవంబర్ 18 నుండి బుకింగ్లను తీసుకోవడం ఆపేశాయని తెలుస్తోంది.
నిజానికి ప్రపంచకప్ షెడ్యూల్ వెలువడిన వెంటనే ధరల పెంపుపై అహ్మదాబాద్లోని హోటళ్ల వారు మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. భారత జట్టు ఫైనల్ కి రావాలని అందరికంటే వారే దేవుడిని ఎక్కువగా ప్రార్ధించినట్టు ఉన్నారు.
దేవుడు వారి మోర ఆలకించాడో ఏమోకానీ టీమ్ ఇండియా ఫైనల్ కి చేరుకుంది. అహ్మదాబాద్ లో హోటల్స్ నిర్వాహకుల పంట పండింది.
అహ్మదాబాద్ లోని విలాసవంతమైన హోటళ్ల ధరలు ఒక్కసారి చూద్దాం. హోటల్ ITC వెల్కమ్ ఒక రాత్రి గది అద్దె ఒక లక్ష రూపాయలు.
హోటల్ వివంత ఒక రాత్రి ధర 90 వేల రూపాయలు. కోర్ట్ యార్డ్ మారియట్ 60 వేలు, హోటల్ నవోదయ 55 వేల రూపాయలు పలుకుతోంది. ప్రస్తుతం నగరంలో ఫైవ్ స్టార్, త్రీ స్టార్ హోటళ్ల వన్ నైట్ రెంట్ 10 వేల రూపాయలకు పైగా ఉన్నాయి.
పనిలో పనిగా వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని విమాన సర్వీసులు కూడా అహ్మదామద్ కి ఛార్జీలను భారీగా పెంచాయి.
సాధారణ రోజుల్లో విమాన ఛార్జీలు, సర్వీసులను బట్టి 3500 నుంచి 5 వేల వరకు ఉండగా ఇప్పుడు 25 నుండి 30 వేల రూపాయలకు పెరిగిందట. ఈ ధరలను రాత్రికి రాత్రే పెంచినట్టు తెలిసి ప్రయాణికులు అవాక్కవుతున్నారు.