ఆస్టేలియా, భారత్ మధ్య అత్యున్నత స్థాయి సంబంధాలు ఏర్పడటం ఇటీవలి కాలంలో తరచుగా చూస్తున్నాం. శతాబ్దాల పాటు ఇరుదేశాల మధ్య వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు కొనసాగుతున్నట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నప్పటికీ రాజకీయ సంబంధాలు చాలా తక్కువ స్థాయిలోనే ఏర్పడ్డాయనేది తెలిసిన విషయమే. చాలా కాలంగా ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడాలని ఆస్ట్రేలియా పండితులు సూచిస్తున్నప్పటికీ అనేక కారణాల వల్ల భారత్తో ఆస్ట్రేలియా సంబంధాలు పలుచబారి ఉండేవనే చెప్పాలి. కానీ ఒక్కసారిగా ఆస్ట్రేలియా విధాన నిర్ణేతల ఆలోచనలు భారత్వైపు తిరిగాయి. దీనికి కారణం తెలిస్తే ఆశ్చర్యపడక మానము. సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అస్ట్రేలియా ఆలోచనా విధానంలో పెను మార్పు తీసుకొచ్చారని చెప్పాలి. ఈ మార్పు వెనుక నేపథ్యాన్ని కూలంకషంగా తెలుసుకుందాం.
2016లో ఆస్ట్రేలియా జనాభా గణన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. ఆస్ట్రేలియాలో వేగంగా ఎదుగుతున్న మతంగా హిందూ మతం ముందుకొచ్చిందని తెలిపింది. ఆనాటికి దాదాపు 5లక్షల మంది హిందువులు ఆస్ట్రేలియాలో నివాసం ఉంటూండేవారు. ఇటీవల జరిపిన తాజా జనగణన కూడా ఈ ధోరణి కొనసాగుతోందని తెలిసింది. ఆస్ట్రేలియాలో హిందువుల జనాభా పెరుగుతున్నట్లుగానే ఇరుదేశాల మధ్య రక్షణ, సైన్స్, వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, ప్రైవేట్ రంగం అభివృద్ధి వంటి పలు అంశాల్లో చొరవతో కూడిన నిర్ణయాలు చోటు చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వాణిజ్య మండలి ఇరుదేశాల మధ్య సంబంధాలలో వేగాన్ని పెంచుతున్నాయని చెప్పాలి.
ఇటీవలే భారత్లో బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు ఆస్ట్రేలియా హై కమిషనర్లు ప్రవాస భారత మూలాలు కలిగి ఉండటం విశేషం. వారిలో ఒకరు పీటర్ వర్గీస్. ఈయన మలయాళీ దంపతులకు కెన్యాలో జన్మించారు.మరొకరు హరీందర్ సింధు సింగపూర్లో జన్మించారు. ఈ పరిణామాలు న్యూ సౌత్ వేల్స్ మాజీ ప్రీమియర్ అయిన బెర్ట్రామ్ స్టీవెన్స్ మహదానందపర్చి ఉండేవి. ఈయన 1946లోనే న్యూ హారిజోన్స్ ఎ స్టడీ ఆఫ్ ఆస్ట్రేలియన్-ఇండియా రిలేషన్స్ అనే పుస్తకం రాశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన ఆనాడే అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే, లాంచనప్రాయమైన సంబంధాల విస్తత చరిత్ర ఉన్నప్పటికీ హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఈ ఇరుగుపొరుగు దేశాలమధ్య అత్యున్నత స్థాయి సంబంధాలకు ఇంత సుదీర్ఘ కాలం ఎందుకు పట్టిందన్నదే.
ఆస్ట్రేలియాలోని మక్వారీ యూనివర్సిటీలో చదివిన భారతీయ పట్టభద్రులు తమ యూనివర్సిటీకి ఆ పేరు ఎలా వచ్చిందన్నది బహుశా తెలీకపోవచ్చు. న్యూ సౌత్ వేల్స్ గవర్నర్ లిచ్లాన్ మక్వారీ 1799లో టిప్పుసుల్తాన్ను ఓడించి, భారతీయ అభివృద్ధి క్రమాన్ని సమూలంగా మార్చివేసిన శ్రీరంగపట్నం ముట్డడిలో పాలు పంచుకున్నారు. ఇక 19వ శతాబ్ది నుంచి ఆస్ట్రేలియన్ గుర్రాల పోటీ నిపుణులు తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటూ భారత్కు వచ్చేశారు. అలాంటివారిలో బెంగళూరుకు విచ్చేసిన సుప్రసిద్ధ జాకీ టెడ్ ఫోర్డైక్ ఒకరు. ఈయన అక్కడే డ్యాన్సర్ అయిన ధనలక్ష్మిని వివాహమాడి అక్కడే రిటైరయ్యారు. బెంగుళూరులో తొలి వాణిజ్య పూలషాపులు తెరిచిన వారిలో వీరూ ఒకరు.
ఇటీవలే, ఆస్ట్రేలియన్ ఐపీఎల్ క్రీడాకారులు, కోచ్లు, ప్రముఖ అధికారులు భారత్ సందర్సిస్తూ మన దేశం గురించి చాలా ఎక్కువగా తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇరుదేశాల క్రీడా సంబంధాలు కూడా గతంలోని వైరుధ్యాలను పక్కనబెట్టాయి. ఇలా భౌగోళికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఏర్పడిన సంబంధాలు సద్భావనను పెంచుతూ వచ్చినప్పటికీ దాన్ని ఒడిసిపట్టి ముందుకు వెళ్లలేకపోయాయి.
ఉదాహరణకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ మొదలెట్టిన అలీన వైఖరి ఆస్ట్రేలియన్ నేతలను భారత్కు దూరం తొలగేటట్లు చేసింది. 1950లలో ప్రచ్ఛన్నయుద్ధ కాలలో సోషలిజం అంటే కమ్యూనిజమేనని ఆస్ట్రేలియన్ నేతలు భావించేవారు. భారతదేశంపై సోవియట్ యూనియన్ ప్రభావం అనేక అనుమానాలను రేకెత్తించింది.
ఈ భౌగోళిక రాజకీయ దృక్పధం కారణంగా రెండో ప్రపంచ యుద్ధానంతరం ఆస్ట్రేలియాను అనేక అంశాల్లో అమెరికా వైపు మళ్లేలా చేసింది. దానికి అనుగుణంగా అనేకమంది యువ ఆస్ట్రేలియన్లు బెంగళూరు, బీజింగ్, బ్యాంకాక్ కంటే లండన్వైపుకు ప్రయాణాలు మొదలెట్టేవారు. పైగా 1901-1960ల కాలంలో రాజ్యమేలిన శ్వేతజాతీయుల అనుకూల విధానం ఆఫ్రికా, ఆసియా నుంచి వలసలను నిషేధించింది. ఆస్ట్రేలియాలో కొనసాగిన జాతివివక్షా విధానాలు పీటర్ వర్గీస్ వంటి ఆస్ట్రేలియన్ కుటుంబాలు భారత్కు వచ్చి గొప్ప సామాజిక దోహదానికి కారణమయ్యారు.
భారత్, ఆస్ట్రేలియా సంబంధాలను మార్చింది చైనాయే
ముందునుంచి భారత్తో ఆస్ట్రేలియా బలమైన సంబంధాలు ఏర్పర్చుకోవాలని ఆస్ట్రేలియా పండితులు సూచిస్తూ వచ్చారు కానీ భారత్ వైరు ఆస్ట్రేలియా విధాన నిర్ణయాన్ని మార్చింది మాత్రం చైనా, ఆ దేశాధ్యక్షుడు జీ జిన్ పింగ్ మాత్రమే అని చెప్పాలి. చైనా ప్రమాదం అనే భావన ఇప్పుడు ఆస్ట్రేలియా రక్షణరంగానికి, మేధోవర్గాల్లో మాత్రమే కాక ఆ దేశ మీడియాలో కూడా మంత్రమై కూర్చుంది. తనప్రధాన వాణిజ్య భాగస్వామి చైనాపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది. ఈ సంక్లిష్టతల క్రమమే క్వాడ్ (ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్) కూటమి సృష్టికి దారితీసింది. దాంతోపాటు ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ముఖ్యమైన భౌగోళిక రాజకీయ జోన్గా చేసింది. దీనికి ప్రతీకారంగా చైనా పసిఫిక్ ఐలాండ్స్, పాపువా న్యూ గినియా, ఇటీవలి కాలంలో సాల్మన్ ఐలండ్స్లో మరింత క్రియాశీలంగా వ్యవహరించడం ప్రారంభించింది.
దీంతో ఆస్ట్రేలియా మరింతగా పాశ్చాత్యదేశాలకు సన్నిహితమైంది. భారత్ కూడా యాక్ట్ ఈస్ట్ పాలసీని ముందుకు తీసుకెళ్లి ఆ దేశాలతో వాణిజ్య, విధాన పరమైన సహకారాన్ని పెంచుకుంటూ వస్తోంది. కాబట్టి అప్పుడెప్పుడో స్టీవెన్సన్ రాసిన న్యూ హారిజోన్స్ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు వాస్తవమవుతున్నాయన్నమాట. ప్రపంచమంతటా భారత సంతతి సీఈవోల సంఖ్య పెరగటం, విద్యలో, మేధోపరమైన నేతలుగా ఎదగడం, లెక్కకుమంచి క్రీడాకారిణులు, క్రీడాకారులు రూపొందడం. బలమైన ప్రభుత్వాలు ఏర్పడటం, యువజన సదస్సులు ఎన్నో జరుగుతుండటం ఇవన్నీ దీనికి సంకేతాలే. అయినప్పటికీ భారత్ పట్ల పాత ఆలోచనా విధానం కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ క్వీన్స్ లాండ్లో తలపెట్టిన మెగా క్వీన్స్లాండ్ కోల్ మైన్ ఆస్ట్రేలియాలో పర్యావరణపరంగా విమర్శలు ఎదుర్కొంది. దీంట్లో విదేశీ వ్యతిరేక అంశం కూడా ఉందనుకోండి. మరోవైపున ఆస్ట్రేలియా ఉక్కు పరిశ్రమ సంజీవ్ గుప్తాకు చెందిన లిబర్టీ హౌస్ గ్రూప్ వల్ల బతికిబట్టకట్టిందనే వాస్తవాన్ని కూడా మర్చిపోకూడదు.
ఇక హిందూ మహాసముద్ర రేవు పట్టణమైన పెర్త్లోని ఫ్రెమాంటిల్ లో 100మిలియన్ డాలర్లతో సినిమా స్టూడియో కాంప్లెక్స్ నిర్మించాలని పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం పథకాలు రచిస్తోంది. దీని ప్రధాన లక్ష్యం హాలీవుడ్. పసిఫిక్ మహాసముద్రం గుండా హాలీవుడ్ నుంచి ఇక్కడికి రావాలంటే 20గంటల సమయం పడుతుంది. కానీ బాలీవుడ్, టాలీవుడ్ కి దానికి సగం సమయంలోనే చేరుకోవచ్చు. పైగా భారతీయ చిత్రపరిశ్రమ ఇప్పుడు ఆస్ట్రేలియాకు పెద్ద మార్కెట్ కాబోతోందన్నమాట. చివరగా చెప్పాలంటే ఆస్ట్రేలియా నిజంగా భారత్ గురించి ఆలోచించడానికి చాలా మార్గాలున్నాయి మరి.